ఆధ్యాత్మిక వైభవం.... పోలేరమ్మ జాతర
ఉమ్మడి నెల్లూరు జిల్లా... నేటి తిరుపతి జిల్లాలో జరిగే విశిష్టమైన ఉత్సవాల్లో
పోలేరమ్మ జాతర కూడా ఒకటి.... అమ్మా అని పిలిచినంతనే.... పలికే దేవతగా పోలేరమ్మ ప్రసిద్ధం.... పిలిచిన పలికే దేవతగా పూజలందుకుంటున్న అమ్మ వారికి సాంప్రదాయంగా ఏటా జరుపుకొనే జాతరే.... పోలేరమ్మ జాతర....
వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ జాతర 17వ శతాబ్ధం నుంచి జరుగుతున్న ఇప్పటికీ
తన ప్రాశస్త్యాన్ని అలానే కొనసాగిస్తోంది.. 1717 వెంకటగిరి పట్టణంలో కలరా వ్యాప్తి చెందింది..
అప్పటి నుంచి రాజాలు శీతల యాగాన్ని జరిపించారు... అనంతరం అష్టదిగ్బంధనం చేసి
యంత్రాలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి పోలేరమ్మ జాతరను నిర్వహించారు..నాటి నుంచి
జాతర నిర్విరామంగా ప్రతి యేడాది సాగుతోంది.
వినాయక చవితి వెళ్లిన మూడవ బుధ , గురువారాల్లో అమ్మవారి జాతర జరుగుతోంది.
వినాయక చవితి ముగిసిన తొలి బుధ వారం రాత్రి తొలి చాటింపు వేస్తారు. రెండు బుధవారం
మలి చాటింపు వేస్తారు. ఈ చాటింపు బయటివారు విన్నా... చాటింపు తర్వాత గ్రామంలో నిదుర
చేసినా వారు తప్పక జాతరలో పాల్గొనాలని నమ్మకం.. రెండవ చాటింపు తర్వాత వచ్చే
ఆదివారం జాతరలో ప్రధాన పాత్ర వహించే ఘటోత్సవాన్ని జరుపుతారు. పచ్చి కుండలను
తయారు చేసి.. వాటిని వెంకటగిరిలోని కాంపాళెంలో ఉంచి.. అనంతరం వాటిని జీనిగల
వీధిలో అమ్మవారి అత్తగారి ఇల్లైన చాకలి మంటపానికి తీసుకెళతారు. అక్కడ పూజలు చేసిన
అనంతరం ఆ కుండలను అమ్మవారి ఆలయానికి తీసుకువస్తారు. తొలుత వెంకటగిరి రాజాల
ఇంటికి తరలిస్తారు. అనంతరం రాజ వంశీయులు తమ పరివారంతో ఘటాలకు పూజలు
చేస్తారు.. తర్వాత ఆ కుండలను గ్రామంలోని ప్రతి ఇంటికి తీసుకెళతారు. ప్రజలు వాటికి భక్తి
పూర్వకంగా పూజలు చేస్తారు.
అమ్మవారి పుట్టినిల్లైన కుమ్మరి మండపంలో మిరాశీదారులు అత్యంత భక్తితో
పోలేరమ్మ విగ్రహాన్ని తయారు చేస్తారు. కానీ అమ్మవారికి కళ్లు మాత్రం పెట్టరు.. బొమ్మను
తయారు చేసే క్రమంలో వారు ఇతమిద్ధంగా రూపాన్ని ఊహించరు.. కానీ అమ్మవారి ముఖం
తయారయ్యే విధానాన్ని అనుసరించి... ఆ ఏడాది పరిస్థితులను ప్రజలు ఊహిస్తారు.
అనంతరం జీనిగల వీధిలోని అత్తవారిల్లైన చాకలి మంటపానికి తరలిస్తారు. అక్కడ
అమ్మవారి పసుపు కుంకుమల సారెను ఏర్పాటు చేస్తారు. అనంతరం అద్దంలో చూస్తూ..
అమ్మవారికి కనుపాపలను పెడతారు. ఈ తంతు పూర్తయ్యే సరికి... అర్ధరాత్రి దాటుతుంది..
అమ్మవారి రూపం కుదిరిన తర్వాత పూలతో అలంకరించిన రథంపై అమ్మవారిని ఉంచి
ఊరేగిస్తారు. అమ్మవారు ఊరంతా తిరిగి బజారు వీధిలోని అమ్మవారి ఆలయం వద్దకు
వస్తుంది. ఈ ఊరేగింపు పూర్తయ్యే సరికి.. సరాసరి తెల్లవారుతుంది. అమ్మవారి ఊరేగింపు
సమయంలో ప్రజలు మొక్కుబడులు చెల్లించుకుంటారు.. వారు మొక్కిన మేకను.. కోడినో
అమ్మవారికి బోనంగా ఇస్తారు.. ఆసమయంలో బలిచ్చే జంతువుల నెత్తురు.. కొట్టె
కొబ్బరికాయల్లోని నీళ్లతో... అమ్మవారు ప్రయాణించే మార్గమంతా.. తడిసిపోతుంది...
బజారు వీధిలోని పోలేరమ్మ గుడి వద్ద అమ్మవారిని నిలుపుతారు.. అక్కడ గురువారం
సాయంత్రం వరకు అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. ఆ సమయంలో దేవాదాయ
ధర్మదాయశాఖ అధికారులు అమ్మవారికి సారెను సమర్పిస్తారు. అనంతరం బజారు వీధి
మీదుగా అమ్మవారికి తరలింపు సాగుతుంది.అమ్మవారిని మల్లమ్మ గుడి వరకు ఊరేగింపుగా
తీసుకెళతారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మంటపంపై అమ్మవారిని నిమజ్జనం
చేస్తారు. నిమజ్జన సమయంలో అమ్మవారిని తయారు చేసిన మట్టి కోసం భక్తులు
ఎగబడతారు.. ఈ మట్టిని నుదుటన దాలిస్తే .. సర్వశుభాలు కలుగుతాయని నమ్మకం.. 1992
నుంచి ఈ ఉత్సవాన్ని దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఈ ఏడాది
దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను
నిర్వహిస్తోంది.
పోలేరమ్మ జాతర ఆధ్యాత్మిక విశేషాల్లో ప్రత్యేకమైనది.. అమ్మవారిని
దర్శించుకునేందుకు దేశ విదేశాల భక్తులు వస్తారనడం లో ఆశ్చర్యం లేదు.. ఎందరో
ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని తరిస్తారు...
- విరించిక

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి